కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు చేయకూడదని స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమపై అవినీతి ఆరోపణల కేసులు దర్యాప్తు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిందితులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్ల ధర్మాసనం సీబీఐ ఏర్పాటు మాతృచట్టం దిల్లీ ప్రత్యేక పోలీసు ఏర్పాటు చట్టం-డీఎస్పీఈలోని సెక్షన్ 5, 6ను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. డీఎస్పీఈ సభ్యుల అధికారాలను, పరిధిని కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒక రాష్ట్రానికి విస్తరించటానికి సెక్షన్ 5 కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతిస్తుందని, రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేపట్టకూడదని సెక్షన్ 6 చెబుతోందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.
పంజాబ్, బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, కేరళ రాష్ట్రాలు సీబీఐ తమ రాష్ట్రంలోకి రాకుండా తీర్మానాలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.