ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీ హిమపాతం వల్ల ఓ సైనికుడు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని తంగ్దార్ సెక్టార్లో ఉన్న రోషన్ పోస్టు సమీపంలో నిన్న రాత్రి 8 గంటల సమయంలో భారీగా మంచు వర్షం కురిసింది. దీంతో రోషన్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న 7 రాష్ట్రీయ రైఫిల్ దళానికి చెందిన ముగ్గురు సైనికులు మంచులో కూరుకుపోయారు. వెంటనే గుర్తించిన బలగాలు వారిని మంచు పొరల కిందినుంచి వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఓ సైనికుడు మృతిచెందాడని డాక్టర్లు ప్రకటించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన సైనికుడిని నిఖిల్ శర్మగా, గాయపడినవారిని రమేశ్ చంద్, గుర్విందర్ సింగ్ గుర్తించారు. కుప్వారా జిల్లాలో గత కొన్నిరోజులుగా భారీ మంచు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలను స్థానిక యంత్రంగం అప్రమత్తం చేసింది.