ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖుష్బూ కారును ఢీ కొట్టిన ట్యాంకర్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 18, 2020, 11:41 AM

ప్రముఖ దక్షిణాది నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును.. ట్యాంకర్ వేగంగా ఢీ కొట్టింది. కారు ఎడమ వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. నుజ్జునుజ్జయింది. సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడగలిగారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తాను, భర్త సుందర్ కొలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించినట్లు భావిస్తున్నానని చెప్పారు.


తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు. దీనికోసం ఖుష్బూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దీన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిరోజుల కిందటే తమిళనాడు బీజేపీ నేతలు వేల్ యాత్రై కార్యక్రమాన్ని తలపెట్టారు.


రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కడలూర్‌లో కొనసాగుతోంది. ఇందులో పాల్గొనడానికి ఆమె మంగళవారం రాత్రి చెన్నై నుంచి కడలూర్‌కు తన కారులో బయలుదేరారు.మార్గమధ్యలో మేళ్‌మరువత్తూర్ వద్దకు చేరుకున్న కొద్దిసేపటికే ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్యాంకర్ ఆమె కారును ఢీ కొట్టింది. ఈ ప్రయత్నంలో కారును కుడివైపునకు తిప్పడంతో.. ట్యాంకర్ కారు ఎడమ వైపు భాగాన్ని రాసుకుంటూ వెళ్లింది. ఎడమ వైపు డోర్ తుక్కు తుక్కయింది. ట్యాంకర్ ఎదురుగా కారును ఢీ కొట్టకపోవడం, సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఖుష్బూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ఘటన తరువాత.. తాను మరో వాహనంలో కడలూర్‌కు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com