ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంతో ఏపీలో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న వ్యవహారాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా రెడీ చేసింది.
తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఉండడంతో.. ఆ ప్రక్రియకు సంబంధించిన శాఖల ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాల మేరకు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ కార్యక్రమం నవంబరు 16 నుంచి జనవరి 15 వరకు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాదు జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధమున్న అధికారులెవరినీ బదిలీలు చేయకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడకుండా అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరుపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 4లోపు ఫలితం కూడా తేలనుంది. ఈ పరిణామాలను అంచనా వేసుకుని ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత నుంచి మార్చి లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక అధికారులతో పాలన నడుస్తోంది. అది ఫిబ్రవరితో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.