జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ మంగళ, బుధవారం.. ఈ రెండు రోజులు గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. లాక్ డౌన్ నిబంధనలు, చాతుర్ మాస దీక్ష, సినిమాల హడావుడితో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మరోవైపు అమరావతి రైతులు, మహిళలతో కూడా పవన్ భేటీ కానునుండం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో పవన్ రాజకీయ పరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆన్ లైన్లో సమావేశాలు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటిని అమలుపరచడంలేదు. ఇటీవల అమరావతిలో జరిగిన వరుస పరిణామాలు, పోలవరంపై రాజకీయ రగడ జరిగిన నేపథ్యంలో కూడా జనసేనానికి జనంలోకి రాని పరిస్థితి. అయితే యువతులు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాత్రం పత్రికా ప్రకటనలు, వీడియోలను పవన్ విడుదల చేశారు. అమరావతికి జనసేన మద్దతు ఇస్తుందని, అవసరమైన సమయంలో ప్రత్యక్ష పోరాటం చేస్తామని పవన్ గతంలో రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రకటించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ అంగీకరించాకే తాము ఆ పార్టీతో కలిసి నడుస్తున్నామని పవన్ అప్పట్లో అన్నారు.