ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను తాను విచారించలేనని ఆ కేసు విచారణకు వచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తెలిపారు. ఒకప్పుడు న్యాయవాదిగా ఓ కేసులో జగన్మోహన్ రెడ్డి తరఫున తాను వాదించానని కాబట్టి, ఇప్పుడీ కేసును తాను విచారించడం సముచితం కాదని ఆయన తప్పుకొన్నారు. సుప్రీంకోర్టులో సీజేఐ తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి, దాన్ని మీడియాకు బయటపెట్టిన నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.
సీజేఐ ఎస్ఏ బాబ్డేతో సంప్రదించిన తరువాత ఈ కేసును తగిన బెంచ్కు లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించిన సంగతి తెలిసిందే. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్ ఈ పిల్ వేశారు. సీఎం జగన్ పై విదేశాలకు డబ్బు అక్రమ తరలింపు, అవినీతి సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని అవి చాలా తీవ్రమైన కేసులని వారు పిల్ లో ఆరోపించారు. ఆధారాలు లేకుండా జగన్ ప్రజల ముందు, మీడియా ముందు దేశంలోనే రెండో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ వీ రణమపై ఆరోపణలు చేశారని పిల్లో తెలిపారు. వెంటనే జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్లో కోరారు. "కోర్టు నుంచి వ్యక్తిగత ప్రయోజనాలను పొందేందుకు తన ముఖ్యమంత్రి పదవి అధికారాలను ఉపయోగించుకొని... అందరి ముందు ఓపెన్గా ఆసత్య ఆరోపణలు చేశారు.
సుప్రీంకోర్టు సిట్టిం జడ్జిగా ఉన్నవారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ఆయన ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థను మసకబార్చారు" అని పిల్లో అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జిలతో రాజ్యాంగబద్ధంగా ఓ అంతర్గత కమిటీ వేసి.. దానితో ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలనీ, అలాగే సీబీఐతో కూడా దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. అయితే కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.