జమ్మూకశ్మీర్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు అందిస్తున్న సమాచారం సహకారంతో భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుపడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు లొంగిపోతున్నారు. అలాగే ఎదురుకాల్పులకు పాల్పడుతున్న ముష్కరులను భద్రతా దళాలు మట్టుపెడుతున్నాయి.తాజాగా బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వాలో ఉగ్రవాదులు ఉన్నారని మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సాయుధ బలగాలతో కలిసి వారు కూంబింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. మృతిచెందిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కూంబింగ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమైన దాదాపు 5 గంటల పాటు కొనసాగింది.