బిర్యానీ షాపు ప్రారంభించాలనుకున్నాడు. అంతే ప్రారంభోత్సవం రోజు నాడే భారీ ఆఫర్ ప్రకటించేశాడు. రూ.10కే బిర్యానీ అంటూ పత్రికల్లో యాడ్ వేయించాడు. దీంతో జనం దుకాణం దగ్గర ఎగబడ్డారు. ఆ ఆఫర్ అతడి కొంప ముంచింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని అరుపుకోట్టాయికి చెందిన 29 ఏళ్ల జహీర్ హుస్సేన్ స్థానికంగా బిర్యానీ షాపు పెట్టాలనుకున్నాడు. గత ఆదివారం రోజు షాపు ప్రారంభోత్సవానికి ప్లాన్ వేశాడు. ప్రారంభోత్సవం రోజు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్లేట్ బిర్యాని రూ. 10లకే అని యాడ్ ఇచ్చాడు.
దీంతో ప్రజలు ఆదివారం ఉదయం 11 గంటలకు బిర్యానీ షాపు ముందు బారులు తీరారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా దుకాణం దగ్గర ఎగబడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. షాపు నిర్వాహకులు ప్రారంభోత్సవ ఆఫర్ కింద 2500 ప్యాకెట్ల బిర్యానీలను విక్రయించడానికి సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అయిపోయిన వెంటనే అమ్మకాలు ప్రారంభించారు. 500 ప్యాకెట్లను విక్రయించే సరికి పోలీసులు వచ్చారు. షాపు వద్ద ఉన్న రద్దీని క్రమబద్దీకరించి...ట్రాఫిక్ను క్లీయర్ చేశారు. షాపు నిర్వాహకులు 500 ప్యాకెట్లు అమ్మగా మిగిలిన వాటిని పేదలు, వికలాంగులు, అనాథలకు పంచిపెట్టాలని స్థానిక సీనియర్ పోలీస్ అధికారి నిర్ణయించారు.
షాపు ముందు ఉన్న పోలీసులతో ఆ మిగిలిన ప్యాకెట్లను పంచిపెట్టారు. అక్కడితో ఆగిపోలేదు. కరోనా మహమ్మారి నిబంధనలను ఉల్లంఘించినందుకు జహీర్ను విరుదునగర్ పోలీసులు అరెస్టు చేశారు. షాపు యజమాని జహీర్ మీద పోలీసులు ఐపీసీలోని వివిధ విభాగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ఇటువంటి జిమ్మిక్కులను ప్రవేశపెట్టకూడదని పోలీసులు జహీర్ను హెచ్చరించారు. ఆ తర్వాత అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.