పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసుల తీరుపై మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ మండిపడ్డారు. ‘తనపై తప్పుడు కేసులు పెట్టిన ఖాకీలపై ప్రైవేట్ కేసు పెడతా. పోలీస్ రాజ్యం ఎక్కువ కాలం సాగదని తెలుసుకోండి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది. తప్పుడు కేసులు పెట్టి.. తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా. తనపై కేసులు పెట్టిన పోలీసులు.. జగన్పై, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు పెట్టలేదు? డీజీపీ, కొవ్వూరు సీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణల వైఖరి చూస్తుంటే.. వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేలా ఉన్నారు. కృష్ణాజిల్లాలో మంత్రి అండదండలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇసుక మాఫియాలో మునిగితేలుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు జగన్కు తొత్తులుగా మారి వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి’ అని జవహర్ ధ్వజమెత్తారు.