భర్తను హత్య చేయడమే కాకుండా, కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించిన ఓ మహిళా న్యాయవాదిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం మేరకు..అనిందిత పాల్ డే, రజత్ కుమార్లు కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా కోల్కతా హైకోర్టులో న్యాయవాదులుగా ఉంటూ నగర శివార్లలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. అయితే 2018 నవంబర్ 25న అనిందిత తన భర్తను మొబైల్ చార్జర్ కేబుల్ను మెడకు చుట్టి హత్య చేసింది. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్టు వ్యవహరించింది.రజత్ బెడ్పై నుంచి కిందపడి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రజత్ ముఖం నీలం రంగులోకి మారి ఉండటం, గొంతుపై కూడా రాపిడి జరిగిన గుర్తులు ఉండటం గమనించారు. ఈ క్రమంలో అనిందిత కేసును తప్పుదోవ పట్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నించింది. అన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం అనిందితను దోషిగా తేల్చింది. ఇందుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.