సరిహద్దుల వద్ద చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. అయితే, చైనా కుయుక్తులను భారత ఆర్మీ ముందే పసిగడుతూ తిప్పికొడుతోంది. గాల్వన్లో ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ మధ్య ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశల వారీగా ఆర్మీని వెనక్కి రప్పించాలనే ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది.
చైనా నిన్న, మొన్న తూర్పు లడఖ్, ప్యాంగాంగ్ సరస్సు వద్ద స్టేటస్ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా భారత ఆర్మీ వెంటనే చైనా యత్నాలను తిప్పికొట్టింది. దీంతో చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం ఉద్రిక్తతలను తగ్గించేందుకు చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో భారత్-చైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.