అన్నదాతలకు ముఖ్యమైన గమనిక. కిసాన్ క్రెడిట్ కార్డు మీద రుణాలు పొందిన రైతులకు గడువు దగ్గరకు వస్తోంది. ఇంకో 20 రోజుల్లో వారు రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకవేళ తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోతే 4 శాతం కాకుండా 7 శాతం వడ్డీ పడుతుంది. రైతులు బ్యాంక్ నుంచి తీసుకున్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను ఆగస్ట్ 31లోపు తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.కేసీసీ రుణాలను సాధారణంగా మార్చి 31లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఈ గడువును మే వరకు, తర్వాత మళ్లీ ఆగస్ట్ చివరి వరకు పొడిగించింది. దీంతో ఇప్పుడు రైతులు పంట రుణాలను ఆగస్ట్ 31లోపు చెల్లించి వడ్డీ రాయితీ ప్రయోజనం పొందే అవకాశం కల్పించింది. రైతులు డబ్బులు చెల్లించి ఒక రెండు రోజుల తర్వాత వాటిని మళ్లీ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆగస్ట్ లోపు డబ్బులు చెల్లిస్తే 4 శాతం వడ్డీ పడుతుంది. ఆగస్ట్ 31 దాటితే 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రైతులు గడువులోగా డబ్బులు చెల్లిస్తే అధిక వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు.