ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పంజాబ్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. కరోనా కాలంలో పంజాబ్లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రొత్సహించేలా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వతేదీన పంజాబ్ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించేలా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 12వతరగతి చదవుతున్న విద్యార్థులందరికీ స్మార్ట్ ఫోన్లను అందిస్తామని పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఆగస్టు 12వతేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం నాడు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు.