రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ రేట్లు అమల్లోకి వచ్చాయి. మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వెబ్సైట్ ద్వారా రెవెన్యూశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుంటూరులో 10శాతం, విశాఖపట్నంలో 25 శాతం, అనంతపురంలో 30శాతం మేర ధరలను పెంచింది. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన భూముల ధరలతో రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మార్కెట్ ధరలకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోని వ్యత్యాసాల పరిశీలనకు ఓ కమిటీని నియమించింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ కమిటీ భూముల ధరలను నిర్ణయించనుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటన విడుదల చేశారు.