కరెంటుబిల్లు ఎక్కువ రావడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో చోటుచేసుకుంది. లీలాధర్ లక్ష్మణ్ అనే 57 ఏళ్ల వ్యక్తి ఇంటికి గత వారం కరెంట్ బిల్లు ఏకంగా రూ. 40,000 వచ్చింది. అప్పటి నుంచి ఆందోళన చెందుతున్న లక్ష్మణ్.. రెండు రోజుల క్రితం తన నివాసంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. కరెంట్ బిల్లు టెన్షన్ కారణంగా అతిగా మద్యం సేవించిన లక్ష్మణ్ ఆ మత్తులోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి చనిపోయిన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.