అప్పడం తినడం ద్వారా కరోనా వైరస్ రాకుండా నియంత్రించవచ్చంటూ ప్రకటించి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. తనకు రెండుసార్లు కరోనా టెస్టులు జరిగాయని, రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. అర్జున్ మేఘావాల్ ప్రస్తుతం కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మేఘావాల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘భాబీ జీ పాపడ్’ తింటే కరోనా రాదని, ఆ అప్పడాలు మనిషిలో రోగనిరోధక శక్తిని, యాంటీబాడీస్ను పెంపొందిస్తాయని చెప్పారు. ఆ సమయంలో ఆయన నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.