కరోనా మహమ్మారితో జనం పిట్టల్లా రాలిపోతుంటే కనీస కనికరం లేకుండా కొందరు దుర్మార్గులు కోవిడ్తో చనిపోయిన వారి శవాలపై నగలను మాయం చేస్తున్న అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. టిఒఐ కథనం మేరకు.. తిరుపతి నెహ్రూనగర్కి చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో పద్మావతి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరే సమయంలో కరోనా బాధితుడు ఒంటిపై నగలు, పర్సులో నగదు, సెల్ఫోన్తో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు. కడసారి చూపు కోసం వచ్చిన మృతుడి బంధువులు అతని ఒంటిపై నగలు లేకపోవడం గమనించారు. మృతుడి ఒంటిపై ఆభరణాలు మాయమైనట్లు గ్రహించిన బంధువులు పీఆర్వోకు ఫిర్యాదు చేశారు. కోవిడ్తో చనిపోతే ఒంటిపై ఆభరణాలు మాయం చేశారంటూ మృతుడి చిన్నాన్న ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అది కాస్తా మీడియాలో కూడా రావడంతో ఆస్పత్రి యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మృతుడి కుటుంబ సభ్యులను పిలిపించి శవంపై నగలు ఉన్నట్లు చూపించి వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడి సెల్ఫోన్ కనిపించకపోవడంతో అది కూడా తెచ్చివ్వాలని.. లేకుంటే నగలు కూడా అసవరం లేదంటూ బంధువులు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కరోనా మృతుడి అంత్యక్రియలు కూడా నిలిచిపోయాయి.