తన పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఆ తండ్రి కల. కానీ, కరోనా కారణంగా అతడి కలలు ఛిద్రమయ్యాయి. ఆ పిల్లలు చదువుతున్న స్కూల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయని ఆ తండ్రికి తెలిసింది. అయితే, అతడి వద్ద స్మార్ట్ఫోన్ లేదు. చివరికి తన కుటుంబం కడుపు నింపుతున్న ఆవును అమ్మేసి.. పిల్లలకు స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు. ఈ దయనీయ ఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.టీఓఐ కథనం మేరకు, కంగ్రా జిల్లా జ్వలాముఖీకి చెందిన కులదీప్ కుమార్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు 4వ తరగతి, మరొకరు రెండో తరగతి చదువుతున్నారు. తన పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు రూ.6 వేలు అవసరమయ్యాయి. ఎక్కడ అప్పు లభించలేదు. చివరికి పంచాయతీ పెద్దలను ఆశ్రయించినా.. సాయం దొరకలేదు. దీంతో తాను ఎంతో ప్రాణంగా చూసుకొనే ఆవును అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేశాడు.వీరి దయనీయ స్థితిని ట్రిబ్యూన్ పత్రిక రిపోర్టర్ రవీందర్ సూద్ వెలుగులోకి తెచ్చాడు. ఈ కథనానికి సంబంధించిన పేపర్ క్లిప్ను ట్వీట్ చేస్తూ.. ‘‘మోదీగారు.. ఇలాంటి పేదలను ఆదుకోడానికి మీరు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఏమయ్యాయి’’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్గా మారింది. ఈ ట్వీట్ చూసిన నటుడు, సామాజిక సేవకుడు సోనుసూద్ వెంటనే స్పందించారు. ‘‘దయచేసి ఆయన వివరాలను నాకు అందిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.