రాజ్యసభ సభ్యుడు, సమాజ్వాదీ పార్టీ మాజీ సీనియర్ నేత అమర్సింగ్ (64) మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని నెలల పాటు సింగపూర్లో వైద్య చికిత్స సైతం తీసుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘర్లో ఆయన జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్సింగ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్కు అత్యంత సన్నిహితుడు.యూపీఏ 1 హయాంలో న్యూక్లియర్ ఒప్పందం సందదర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉపసంహరించుకుంది. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అమర్ సింగ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో దేశ రాజకీయాల్లో ఆయన పేరు మార్మోగింది. సీనియర్ హీరోయిన్ జయప్రదను ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకు పరిచయం చేసింది కూడా ఆయనే. అమర్ సింగ్ను బహిష్కరించిన సమయంలోనే జయప్రదను కూడా ఎస్పీ నుంచి బయటకు పంపారు. సినీ, వ్యాపార వర్గాలతో అమర్ సింగ్కు చాలా పరిచయాలు ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీని ఆర్థికంగా ఆదుకోవడానికి, గ్లామర్ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో సైతం అమర్ సింగ్కు మంచి సంబంధాలు ఉన్నాయి.