కరోనా నేపథ్యంలో విమానాలు రద్దు చేయడంతో దేశానికి చెందిన అనేక మంది విదేశాల్లో చిక్కుకున్నారు. అయితే వారందరినీ స్వదేశానికి తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అయితే కొందరు అక్రమార్కులు ఈ అవకాశాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ కరోనా హడావుడిలో కస్టమ్స్ అధికారులు తమను ఏం పట్టించుకుంటారులే అనుకుంటున్నారో? ఏమోకాని కొందరు కోట్ల విలువైన బంగారం అక్రమ రవాణాకు సిద్ధమయ్యారు. ఏకంగా రూ.1.66 కోట్ల విలువైన బంగారాన్ని లోదుస్తుల్లో పెట్టుకుని ప్రయాణిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.వివరాల ప్రకారం.. గురువారం డామన్ నుంచి వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణించిన ఓ 11 మంది ప్రయాణికులపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వారిని తనిఖీ చేయగా ప్యాంట్ల లోపలి వైపు ప్రత్యేక ప్యాకెట్లలాగా చేసుకున్నారు. లోస్తుల్లోనూ బంగారం దాచుకున్నారు. ఇలా మొత్తం 3.11 కిలోల బంగారాన్ని ఉంచి అక్రమంగా రవాణ చేసేందుకు ప్రయత్నించారు. 11 మంది ప్రయాణికుల నుంచి అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.1.66 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 11 మంది ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.