ఝార్ఖండ్లోని జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై కాంగ్రెస్ తరపున ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సోరెన్ ప్రభుత్వం కూడా గత బీజేపీ ప్రభుత్వంలానే వ్యవహరిస్తోందని, ఆయన కేబినెట్లోని నలుగురు కాంగ్రెస్ మంత్రులు కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతేకాదు, గత బుధవారం ఢిల్లీ వెళ్లిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేత అహ్మద్ పటేల్ను కలిసి పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనా, ముఖ్యమంత్రి సోరెన్పైనా ఫిర్యాదు చేశారు.తమ అసంతృప్తిని నేరుగా రాహుల్ గాంధీతోనే పంచుకోవాలనుకున్నామని, కానీ కొన్ని శక్తులు తమను అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఆరోపించారు. మరోవైపు, సోరెన్ మంత్రివర్గంలో ఖాళీగా వున్న మంత్రి పదవి పొందడం కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక్కడి పరిణామాలు చూస్తుంటే ఝార్ఖండ్ త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లా మారే అవకాశం లేకపోలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.