కాళ్ల పారాణి ఆరనే లేదు. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తీరనే లేదు. పెళ్లితో కలకలలాడిన ఆ ఇంట్లో వధువు ఆత్మహత్యతో విషాదచాయలు ఏర్పడ్డాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని ఏడిద సీతానగరానికి చెందిన శ్రీను,మంగ దంపతుల కుమార్తె శ్రీదేవి. ఆమెకు 20 సంవత్సరాలు. ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. ఇటీవలే ఓ షార్ట్ ఫిలింలో హీరోయిన్ గా కూడా నటించింది. శ్రీదేవికి తన మేనమామతో బుధవారం వివాహం జరిగింది. శనివారం శ్రీదేవి అత్తగారింటికి వెళ్లాల్సి ఉంది.ఇంతలో ఏమైందో ఏమో కానీ శుక్రవారం ఇంట్లో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. మండపేట ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లితో తన చదువు,సినీ భవిష్యత్ కు ఇబ్బంది వస్తుందని శ్రీదేవి భావించిందా లేక ఇష్టం లేని పెళ్లి జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.