గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో చైనా కాళ్ల బేరాలకు వచ్చింది. భారత్ తమకు మిత్ర దేశమేనని.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని నీతి సూత్రాలు చెబుతోంది. భారత్లో చైనా రాయబారి సన్ వీడాంగ్ శుక్రవారం (జులై 10) చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్-చైనా సంబంధాలను తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపతున్నామని చైనా రాయబారి వీడాంగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు త్వరలోనే మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా-చైనా శత్రువులు కాదని.. చిరకాల మిత్రదేశాలంటూ చెప్పుకొచ్చారు.ఈ మేరకు వీడియో ప్రసంగం విడుదల చేశారు. సంఘర్షణలు పడకుండా.. సమస్యను సరైన దారిలో పరిష్కరించుకోగలిగే సత్తా, పరిజ్ఞానం ఇరుదేశాలకూ ఉన్నాయన్నారు. ఒకరికొకరు నొచ్చుకునే చర్యలకు దిగితే ఇరు దేశాలూ ఆర్థికంగా, వాణిజ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వీడాంగ్ అన్నారు. కొవిడ్-19 మహమ్మారితో చేస్తున్న పోరాటంలోనూ పరస్పర సహకారంతోనే విజయం సాధిస్తామన్నారు. అదే సహకారంతో ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టగలుగుతామన్నారు. ప్రస్తుతం ఇండియా, చైనా అనుమానం కంటే నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు.