ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిడుగు పడితే పేడలో పూడ్చారు..మూఢనమ్మకానికి ఇద్దరు బలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 02:59 PM

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు ఎక్కువగా ఉండే జశ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురైన వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పేడలో పూడ్చి చికిత్స అందించారు. దాంతో పరిస్థితి విషమించి ఇద్దరు మరణించారు. గ్రామస్తుల అంధ విశ్వాసానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. జశ్‌పూర్ జిల్లా బాగ్‌బహర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో సునీల్ సాయి (22), చంపా రౌత్ (20)తో పాటు మరో యువకుడు పొలంలో పనిచేసుకుంటున్నారు. వర్షం పడడంతో ఆ ముగ్గురూ ఓ చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. భారీ ఉరుములకు చెట్టుపై పిడుగు పడడంతో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా స్థానికులు పేడతో కప్పేశారు. కాళ్ల నుంచి మెడ వరకు పేడలో పూడ్చారు. అలా చేస్తే కాలిన గాయాలు నయమవుతాయని వారి నమ్మకం. ఆ తర్వాత కాసేపటికి కొందరు యువకులు వచ్చి గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులను వారించారు. హుటాహుటిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సునీల్ సాయి, చంపా రౌత్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. మరో యువకుడిని ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com