ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జ్ఞానభూమి’లోనే ఫీజులు, ఉపకార వేతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 17, 2017, 02:08 AM

రాజానగరం, మేజర్‌న్యూస్‌ : దేశంలోనే తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో విద్యార్ధుల ఉపకార వేతనాలు, బోధనా ఫీజులు చెల్లింపు విధానాలను ‘జ్ఞానభూమి’ కార్యక్రమం కింద ఒకే వేదికపై తీసుకుని వస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయ ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయంలో జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌కు సంబంధించి ఒక్కరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ద్వారా ఆయా కళాశాలలకు జ్ఞానభూమి విశిష్ఠతతను తెలపాలనే ఉద్దేశ్యంతో సాంఘిక సంక్షేమ శాఖ నన్నయ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలోని నన్నయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మాట్లాడుతూ బోధనా ఫీజులు, ఉపకార వేతనాల విధానాన్ని అనుసంధానిస్తూ రెండింటినీ ఒకే వేదికపైకి తెచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘జ్ఞానభూమి’ వెఃబ్‌ పోర్టల్‌ను రూపొందించిందన్నారు. ఈ పోర్టల్‌ను, లోగోను గత నెల 31న సిఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈపాస్‌ విధానంలో లోపాలను సవరించి ‘జ్ఞానభూమి’ విధానాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ జ్ఞానభూమి ద్వారా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేకుండా సమర్ధవంతంగా ఉపకార వేతనాలు అందుతాయన్నారు. దీనితో ఎప్పటికప్పుడు విద్యార్ధులకు సమాచారం కూడా అందుతుందని, ఎక్కడ లోపాలు తలెత్తే అవకాశం లేకుండా దీనిని రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విద్యార్ధులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందని వీసీ అన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎంఎస్‌.శోభరాణి మాట్లాడుతూ ఈ పాస్‌ విధానం కంటే ఎక్కువ ఉపయోగాలతో విద్యార్ధులకు సులువుగా ఉపకార వేతనం అందే విధంగా దీనిని రూపొందించడం జరిగిందన్నారు. ఈ జ్ఞానభూమి విధానం అంతా కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి వుంటుందని, ఎక్కడా పేపర్‌ వర్క్‌ ఉండదని ఆమె తెలిపారు. దీనికి ఆయా కళాశాలలు అన్ని అప్‌గ్రేడ్‌ అయి డిజిటల్‌ విధానంలోకి రావాలన్నారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు నమోదు చేయాల్సి వుంటుందని, దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడం నుండి ఉపకార వేతనం అంతే వరకు అంతా ఎప్పటికప్పుడు సమాచారం అటు విద్యార్ధులకు, ఇటు కళాశాలకు చేరుతుందని అన్నారు. దీనిలో ధరఖాస్తు చేయాల్సిన బాధ్యత అంతా కళాశాల యాజమాన్యంపైనే వుంటుందని, దానిని నిర్ధారించాల్సిన పని మాత్రం విద్యార్ధులకు ఉంటుందని చెప్పారు. ఇందుకోం విద్యార్ధులకు వారం రోజుల పాటు మెసేస్‌ వచ్చి అలర్ట్‌ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన విద్యార్ధులు అందరికీ సమయానికి ఉపకార వేతనాలు అందుతాయని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జెడి ఆర్‌.డేవిడ్‌కుమార్‌, యూనివర్సిటీ అధికారులు ఈసి మెంబర్‌ పి.విజయనిర్మల, ప్రిన్సిపల్‌ ఆచార్య కె.రమేష్‌, ఆచార్య సురేష్‌వర్మ, అకడమిక్‌ డీన్‌ ఆచార్య ఎస్‌.టేకి, యూనియన్‌ ప్రెసిడెంట్‌ కె.కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com