విజయవాడ, సూర్య బ్యూరో : ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని రాష్ర్ట మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తమకు ఉన్న పత్రికను అడ్డుపెట్టుకుని ఏమి చెప్పినా, ఏమి రాసినా, రైతులు, ప్రజలు వింటారనుకుంటే మూర్ఖత్వం అవుతుందని ఆయన తెలిపారు. గోదావరి డెల్టా విషయంలో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి కొల్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒక ప్రతికా ప్రకటన విడుదల చేశారు. రాష్ర్టంలో నీటి యాజమాన్య పద్దతులను అవలంబించటంలో ముఖ్యమంత్రికి మించిన వ్యక్తే లేరని ఆయన తెలిపారు. ఇక సీలేరు నుంచి క్రిష్టా ఆయకట్టుకు నీటిని అందిస్తానని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఏదొక లెక్కలు చెప్పి ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. శుక్రవారం వచ్చిన కథనం చూస్తే కనీసం అవగాహన లేకుండా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతుందని మంత్రి రవీంద్ర అన్నారు. ముఖ్యంగా గోదావరి నుంచి ప్రతీ సంవత్సరం సగటున 3వేల టి.ఎం.సి. నీరు సముద్రం పాలు అవుతుందని తెలిపారు. పట్టిసం వద్దకు గోదావరి నీరే కాకుండా సీలేరు నుంచి కూడా నీరు వస్తుంది. ఒరిస్సా మాచ్ ఖండ్గ వద్ద మనకు వాటా ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. ప్రతీ ఏటా కనీసం 40 టి.ఎం.సి.లకు పైగా నీరు సీలేరు నుంచి గోదావరికి వస్తుంది. అదే విధంగా ప్రస్తుతం సీలేరుపై ఉన్న ప్రాజెక్టుల వద్ద విద్యుత్తు అవసరాల రీత్యా పది టి.ఎం.సి.వరకూ నీరు నిల్వ ఉంది. అంతే కాకుండా గోదావరి నుంచి కూడా నీరు రావటానికి సిద్ధంగా ఉంది. మాన్సూన్ ప్రారంభం కావటంతో వర్షాలు కూడా ప్రారంభం అయ్యాయి. సీలేరు నుంచి ముందుగా నీరు వచ్చే అవకాశం ఉన్నందున అందులో కొంత నీటిని అవసరం అయితే కృష్ణా డెల్టా ఖరీఫ్ మొదలు కావటానికి నీరందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కేవలం 7వేల క్యూసెక్కుల వరకూ ఉంటే క్రిష్టా డెల్టాలో నారుమళ్లుకు పనులు ప్రారంభం అవుతాయి. ఈ లోపులో వర్షం నీరు వచ్చే అవకాశం ఉంది. ఇలా నీటి కొద్ది పాటి నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. అదే విధంగా పట్టిసీమ నుంచి ప్రతీ ఏటా 80 టి.ఎం.సి. నీరు తరలించటానికి పథకం సిద్ధంగా ఉంది. అలాంటపుడు కృష్ణాడెల్టాకు పంపే నీరు పెద్ద ఎక్కువ కాదని, దీనివల్ల గోదావరి డెల్టాకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గోదావరి డెల్టాకు సరిపడా నీరు ఉంచి ఎక్కడైనా మిగులు జలం ఉంటే కృష్ణాకు తరలిస్తారు. అంతేకాదు పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గోదావరి అవసరాల తరవాతే నీటిని కృష్ణాడెల్టాకు తరలించే అవకాశం, ఆలోచన ఉంది. అంతేకాకుండా పట్టిసీమ ప్రాజెక్టు డిజైన్ కూడా అత్యధిక నీరు వచ్చాకే నీటిని తీసుకునే అవకాశం ఉంది. దీనిపై అప్పట్లో అసెంబ్లీలో సైతం వైసీపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేశారు. 14 మీటర్లకు చేరిన తరువాతే పట్టిసీమకు నీరు వస్తుంది. గోదావరి ఆయకట్టుకు నష్టం లేకుండానే పట్టిసం ప్రాజెక్టును డిజైన్ చేశారు. కనీసం ఈ కొద్దిపాటి అవగాహన లేకుండా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అంతేకాకుండా గోదావరి డెల్టాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాట్లు కోసం ఏడు వేలు క్యూసెక్కులు సరిపోతాయి. అదే విధంగా కృష్ణా ఆయకట్టుకు ఏడు వేలు వరకూ అవసరం ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావటంతో అటు గోదావరి నుంచి ఇటు సీలేరు నుంచి కూడా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు పట్టిసం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు రావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది. దీని రీత్యా అటు గోదావరి రైతులకు కాని, ఇటు కృష్ణా రైతులకు కూడా ఎలాంటి నష్టం లేకుండా ముఖ్యమంత్రి నీటి పంపిణీ చేయటానికి రెఢీ అవుతున్నారని మంత్రి కొల్లు తెలిపారు. ఇకనైనా ప్రతిపక్షాలు, వారు నిర్వహించే పత్రికలు పూర్తి అవగాహనతో ఉండాలని కోరారు. లేని పక్షంలో రైతులకు అన్యాయం చేసిన ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.