లిక్కర్ వ్యాపారి, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు విజయ మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బ తగలడంతో అతడిని భారత్కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అతడిని భారత్కు తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ చకచకా పావులు కదుతుపున్నాయి. ఐతే ఎప్పుడు తరలిస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. ఐతే అతి త్వరలోనే అతడిని ఇండియాకు తీసుకురానున్నారని తెలుస్తోంది.
'రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్కు తరలించవచ్చు. యూకే సుప్రీంకోర్టులో విజయ్ మాల్యా వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆయన్న భారత్కు అప్పగించేందుకు అవసరమైన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం’’ అని కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు.
మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించిన విషయం తెలిసిందే. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా..ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20న హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. మే 14న విజయ్ మాల్యా వేసిన పిటిషన్ను యూకే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో బ్రిటన్లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇక బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేసిన వెంటనే ఆయన్ను భారత్కు అప్పగిస్తారు.
కాగా, విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్కు పారిపోయారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే.