కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కష్టజీవుల పరిస్థితి వర్ణనాతీతం. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి భారంగా బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వీరికి తీపికబురు అందించింది.
వైఎస్సార్ వాహనమిత్ర రెండోవిడత ఆర్ధికసాయం రూ. 10,000 జూన్ 4 నుండి అందిస్తామని తెలిపింది. గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఉపాధిని కోల్పోయి ఆర్ధికంగా అవస్థలు పడుతున్న ఈ సమయంలో ఈ పథకం వీరికి ఊరటను ఇవ్వనుంది. ఆర్ధికంగా జవసత్వాలను కూడగట్టుకునేందుకు ఈ ఆర్ధికసాయం వారికి ఆసరా కానుంది. లాక్ డౌన్ 4 లో కేంద్రం భారీగా సడలింపులు ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లో కూడా రవాణాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూన్ 4న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వాహనమిత్ర రెండోవిడత ఆర్థికసాయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేయనున్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని రవాణాశాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు.