లండన్: భారతీయ బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు లండన్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువును మరో ఆరు నెలల వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అనంతరం కోర్టు బయట విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ... తాను నిర్దోషినని అన్నారు. భారత సర్కారు తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని చెప్పారు.
విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడం కష్టమే: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి... బ్రిటన్ కు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత ఈజీ కాదని విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ తో మనకు ఉన్న ఒప్పందాల ప్రకారం మాల్యాను మనకు అప్పగించాల్సిందేనని... అయితే, ఇది అంత సులువుగా జరిగే పని కాదని చెప్పారు. అయినా సరే తాము మాత్రం ప్రయత్నాలు ఆపబోమని తెలిపారు. నేరస్తుల అప్పగింతకు నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ ఉండదని... నిరంతర ప్రయత్నాల వల్లే అది సాధ్యమవుతుందని చెప్పారు.