భువనేశ్వర్: పాస్పోర్ట్ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 800 జిల్లా హెడ్ పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోంది. రెండేళ్లలో ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి వీకే సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జిల్లా కేంద్రాల్లోని పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ ఏడాది 150 కేంద్రాలను వచ్చే రెండేళ్లలో 800 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని అన్నారు.