రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి . అయితే కరోనా మహమ్మారిపై వైద్య సిబ్బంది జరుపుతున్న పోరులో సహకారం అందించేందుకు మెడికల్ బ్యాడ్గ్రౌండ్ ఉన్న వాళ్లు ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునకు మంచి స్పందన లభించింది. ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే దాదాపు 2 వేల మంది వాలంటీర్లు తాము కూడా కరోనాపై పోరాటం చేసేందుకు సిద్ధమని ముందుకొచ్చారు. వీరిలో ప్రస్తుతం ఎంబీబీఎస్, డెంటల్, యునాని, ఆయుర్వేదం మరియు నర్సింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా రిజిష్టర్ చేసుకున్న వీరందరికీ డిజిటిల్ ఫ్లాట్ఫాం ద్వారా కోవిడ్ 19పై పోరుకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. నేటి నుంచి ఈ శిక్షణ కొనసాగనుంది. మరోవైపు కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహకరించేందుకు ముందుకొచ్చిన మెడికల్ వాలంటీర్లకు భవిష్యత్తుల్లో జరగబోయే నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని ఏపీ కోవిడ్ 19 వ్యాప్తి నివారణ ప్రత్యేక అధికారి గిరిజా శంకర్ తెలిపారు.