లాక్డౌన్తో దేశమంతటా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేంద్ర, రాష్ట్రాలు ఆర్థికంగా ఆదుకుంటున్నా.. అది ఏ మాత్రం సరిపోవడం లేదు. స్వచ్ఛంద సంస్థలు భోజనంతో పాటు నిత్యావసరాలు పంచుతున్నా.. వాళ్ల ఇబ్బందులు వారికున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ముందు చంద్రబాబు కొత్త డిమాండ్ను ఉంచారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నారని.. వారందరినీ ఆర్థికంగా ఆదుకోవాల్సి అవసరం ఉందని అన్నారు. అలాంటి వారిందరికీ కనీస రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.
"ఏపీలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. లాక్డౌన్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పనిచేస్తే గానీ, పూటగడవని ఎంతోమంది పేదలున్నారు. వారందరినీ ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. ఏపీలోనూ పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలి. రేషన్, పింఛన్లలో అనేకమందికి కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
— చంద్రబాబు నాయుడు"
ఏపీలో వారం రోజుల్లోనే వెయ్యి శాతంపైగా కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని.. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రజలకు వాస్తవాలను చెప్పి.. వ్యాధి నివారణ విషయంలో మరింత సమాయత్తం చేయాలని సూచించారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరింది. మర్కజ్కు వెళ్లొచ్చిన వారిలో చాలా మందికి వైరస్ సోకడంతో యావత్ దేశంతో పాటు ఏపీలోనూ కేసులు పెరుగుతున్నాయి.