కరోనా కట్టడికి సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతులతో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్ధమైంది. ‘కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్’తో ముందుకొచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ఉద్దేశించిన సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది ఏపీ ప్రభుత్వం. దీన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తయారు చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో వారిపై నిఘా పెట్టేందుకు ఈ ట్రాకింగ్ సిస్టంను వాడుకోనుంది. హోమ్ క్వారంటైన్లో ఉండకుండా ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని స్పష్టంగా తెలిపేలా దీన్ని తయారు చేశారు. ఒకేసారి 25 వేల మంది కదలికలను ఇది పసిగట్టగలదు. ఇప్పటి దాకా ఇలాంటి వ్యవస్థను దేశంలోని ఏ రాష్ట్రం కూడా వాడటం లేదు. హోమ్ క్వారంటైన్లో ఉండే వారి సెల్ ఫోన్ నంబర్కు అనుసంధానం చేస్తారు. వారు వినియోగించే ఈ సెల్ఫోన్ నంబర్ను ఆధారంగా చేసుకుని సెల్ టవర్, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతారు. ప్రస్తుతం 25 వేల మందికి సంబంధించిన అన్ని ఫోన్ నంబర్లు, డేటా వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ వివరాలను ఈ ట్రాకింగ్ సిస్టంలో పొందుపరిచారు. కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్న కరోనా వైరస్ అనుమానితుడు తన ఇంటి నుంచి వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జిల్లా అధికారులకు చేరిపోతోంది. వెంటనే వారు ఆ అనుమానితుడికి ఫోన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. అదే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్కు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్, వీధి, ల్యాండ్ మార్క్ ఇవన్నీ పోలీసులకు అందుతాయి. ఇలా కరోనా అనుమానితులను ఇంటి నుంచి బయటకు పంపకుండా చేయవచ్చు. సదరు అనుమానితుడి మొబైల్ నంబర్కు సంబంధించిన ట్రాకింగ్ సమాచారం మొత్తం తమకు అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది.