కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆర్ధిక వ్యవస్థను పటిష్ట పరచడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఆర్బీఐ ఈఎంఐలు 3 నెలలు చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ 2 రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. విద్యుత్ శాఖ ప్రజలకు ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సిబ్బంది కరెంట్ బిల్లులను కొట్టలేని పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రజలు కూడా బయటికి వచ్చి చెల్లించలేని స్థితి ఉంది. దీంతో 3 నెలల పాటు కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని తెలిపే యోచనలో కేంద్రం ఉంది. దీనికి సంబంధించి నేడో రేపో రాష్ట్ర రెగ్యూలేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులటరీ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ప్రకటనతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి కూడా ఉపాధి లభించని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేంద్ర ఇంధన శాఖ ఈ నిర్ణయం తీసుకోనునట్టు తెలుస్తోంది.