కరోనా వైరస్ వణికిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్ కొరియాలో విజృంభించడం ప్రారంభమైంది. చైనా నుంచి మిడిల్ఈస్ట్కి పాకిన కరోనా ధాటికి కనీసం 42 దేశాలు అల్లాడుతున్నాయి.
వాటిలో ఇరాన్ దేశం కూడా ఒకటి. ఏకంగా అక్కడి ఆర్ధికమంత్రి ఇరాజ్ హారిర్చీకి కరోనా టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తాను కరోనాపై పోరాడి గెలుస్తానంటూ చెప్పారాయన. ఇరాజ్ని ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఐసోలేషన్ వార్డ్లో చికిత్స చేస్తోంది. వైరస్ ఎలా సోకిందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. వైరస్ సోకిన రోగులను కలిసిన సమయంలో..తనకు ఈ వ్యాధి వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
తాను ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానని, ప్రస్తుతం తాను ధ్యానం చేస్తున్నట్లు వెల్లడించారాయన. కొన్ని వారాల్లో వైరస్పై ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. వైరస్ చాలా ప్రమాదకరమని, ఇరాన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా బారిన పడి 16 మంది చనిపోయారని, 95 మందికి ఈ వైరస్ సోకిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.