తమిళనాడులో ఎన్ఆర్సీ మంటలు ఇంకా చల్లారడంలేదు. ఇప్పటికీ ఇంకా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఓ వర్గం ప్రజలు అర్ధరాత్రి చేపట్టిన నిరసన ఉద్రిక్తత రేపింది. వన్నార్పేట, అలందూర్ మెట్రో రైల్వే సమీపంలో వారు ఆందోళనకు దిగడంతో... పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి నిరసనగా... ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ఖాకీలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమిషనర్ విజయకుమారితోపాటు కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆ వర్గం ప్రజల ఆందోళనలతో చెన్నై అట్టుడుకుతోంది. కోయంబత్తూరు, పొలాచ్చి, నాగర్కోయిల్, ఊటీ జిల్లాల్లోను ఆందోళనకు దిగారు. మరోవైపు...డీఎంకే నేత స్టాలిన్ కూడా పోలీసుల తీరును ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపున్న వారిని అరెస్ట్ చేశారని.. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.