వన్డే సిరీస్ ఓటమి తర్వాత స్పందించిన జట్టు సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ఈ మూడు వన్డేల సిరీస్ లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లో తమ ప్రదర్శన పర్లేదు అనిపించినా,విజయానికి ఆ ప్రదర్శనలు సరిపోవని కోహ్లీ పేర్కొన్నాడు. టి20 సిరీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు గెలుపు పై త్రివమైన కసితో బరిలో దిగారని, ఈ విషయంలోనే తాము వెనుకబడిపోయామని కోహ్లీ అంగీకరించాడు. ఇక తమ దృష్టంతా రాబోయే టెస్టు సిరీస్ పైనే ఉందని, టెస్టుల్లో తమది సమతూకంతో ఉన్న జట్టు అని అభివర్ణించాడు. అయితే, మైదానంలో దిగినప్పుడు సరైన దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. కాగా, టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 21న ఆరంభం కానుంది. అంతకుముందు భారత్ ఓ ప్రాక్టీసు మ్యాచ్ ఆడనుంది.