ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎందుకు ఓడింది? ఆప్ ఎందుకు గెలిచింది?

national |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 01:15 PM

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన కలిగిస్తున్నాయి. కేంద్రంలో బలమైన పార్టీగా ఉండి దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తున్నా... నిత్యం ఢిల్లీలో దేశ పరిపాలన కొనసాగిస్తున్నా.. కేంద్ర అధికార పార్టీ బిజెపి ఇప్పుడు అదే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసలు బిజెపి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందింది..? అదే సమయంలో క్రేజీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు గెలుపొందింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా.. అక్కడి పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు వేరు వేరు. కానీ కేంద్రంలో తాము చేస్తున్న పనులని పదేపదే ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి చెప్పుకుంటోంది.
ఢిల్లీలో తాము ఫలానా పని చేశామని చెప్పుకునే పరిస్థితుల్లో బిజెపి లేదు. అదే విధంగా ఢిల్లీ లో ప్రభుత్వాన్ని నడుపుతున్న క్రేజీవాల్ ఈ విధంగా విఫలం అయ్యాడు అని విమర్శలు చేసేందుకు కూడా బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. ఇరవై రెండేళ్లుగా బిజెపి ఢిల్లీలో అధికారం లేదు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి తమ సత్తా చాటుకున్నా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా తమ పార్టీ ఫలానా ఫలానా మంచి పనులు చేసింది అని చెప్పుకోవడం లోనూ బిజెపి విఫలమయింది. ఎంతసేపు బిజెపి దేశవ్యాప్తంగా తాము అమలు చేసిన నిర్ణయాల గురించే ఢిల్లీ ఎన్నికల్లోనూ చెప్పుకుంది తప్ప సొంతంగా ఢిల్లీకి తాము చేశామనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవడంలో విఫలమైంది.
కేవలం జాతీయ అంశాలను మాత్రమే పైలెట్ చేసుకుంటూ బిజెపి ముందుకు వెళ్ళింది. ఇదే ఆ పార్టీకి చేదు ఫలితాలను తీసుకు వచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర అధికార పార్టీ గా తాము దేశ వ్యాప్తంగా ఏ ఏ కార్యక్రమాలు, నిర్ణయాలు అమలు చేసామో చెప్పుకుంది తప్ప తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఇలా ఏ రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాలకు ఇప్పటివరకు ఏం చేసాము, ఏం చేయబోతున్నాం అనే విషయంలో బిజెపి గట్టిగా చెప్పుకుని ప్రచారం చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపి వెనుకబడటానికి కారణాలు విశ్లేషిస్తే ఆయా రాష్ట్రాల్లో బలమైన సమర్థులైన నాయకులను తయారు చేసుకోవడం లో బిజెపి ఇప్పటికీ విఫలమవుతూనే వస్తోంది.
కేవలం జాతీయ స్థాయి నాయకులనే ముందర పెట్టుకొని పనిచేయాల్సిన దుస్థితిలో బిజెపి ఉండిపోయింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కు బలమైన ప్రత్యర్థిగా ఫలానా నాయకుడు ఉన్నాడనే ధీమాలో బీజేపీలో లేకుండా పోయింది. విధంగా బిజెపిలో సరైన అభ్యర్థి లేకపోవడం అలాగే తెలంగాణలోనూ కెసిఆర్ కు, ఏపీలో జగన్ చంద్రబాబు కు ధీటైన నాయకులను తయారు చేసుకోలేకపోవడంలో బీజేపీ విఫలమయ్యిందని చెప్పుకోవాలి. ఇలా ఏ రాష్ట్రం లో చూసుకున్నా ఆయా ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులను తయారు చేసుకోవడం లో విఫలం అవుతూనే వస్తోంది.
ముఖ్యంగా ఢిల్లీలో క్రేజివాల్ తన సమర్థతను ఏంటో ఇప్పటికీ నిరూపించుకున్నాడు. గతంలో ఢిల్లీ ప్రజల మేలు కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసానని, మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా పని చేస్తానో చెప్పుకోవడం బాగా సక్సెస్ అయ్యాడు. దీని కారణంగానే ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఇలా వెనుకబడి పోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. స్థానిక నాయకత్వం, బలమైన రాజకీయ నాయకులు ఢిల్లీలో లేకపోవడం ఇవన్నీ బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ఇవే అంశాలు ఆమ్ ఆధ్మీ పార్టీకి బాగా కలిసొచ్చినట్టుగా ఫలితాలను చూస్తే అర్ధం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com