ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలతో తమకు సంబంధం లేదని, నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సచివాలయంలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఆదేరంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువమందికి ఉపాథి కల్పించేది వ్యవసాయరంగమేనని సీఎం స్పష్టంచేశారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఏఐఐబీ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి ఖర్చుపెట్టుకోవచ్చని ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు స్పష్టంచేశారు.