ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల, కాలేజీల రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ల ఛైర్మన్లు జస్టిస్ కాంతారావు, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. నాడు- నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత, మూడో విడత కింద చేపట్టాల్సిన పనులు, టెండర్ల ప్రక్రియపై ఆరా తీశారు. ఈ క్రమంలో మే మధ్యంతరంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, టెండర్లు ఖరారు కాగానే పనులు మొదలుపెడతామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రూ.1000 కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని తెలిపారు.