న్యూ ఢిల్లీ – మరోసారి నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా పడింది..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఉరి శిక్ష అమలును వాయిదా వేస్తున్నట్లు పటియాల కోర్టు ప్రకటించింది.. తదుపరి తేదిని ప్రకటించే వరకూ నిర్భయ దోషులను ఉరి తీయవద్దని కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. తొలుత జనవరి 22న ఉరి తీయాలని భావించగా, అది ఫిబ్రవరి 1కి మారింది. ఇప్పుడది కూడా వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరి వాయిదా వేయాలని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీర్పు వెలువరించారు. దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున స్టే ఇవ్వాలన్న దోషుల వాదనలతో ఏకీభవించింది. . దీంతో ఇప్పటి వరకూ దోషులకు మూడు సార్లు ఉరి తేది వాయిదా పడింది.. వాస్తవానికి దోషులు నలుగురికి ఉరి రేపు తీహార్ జైలులో తీయవలసి ఉంది..పటియాల కోర్టు దీనిపై స్టే ఇవ్వడంతో ఉరి నిలిచిపోయింది..కాగా పటియాల కోర్టు నిర్ణయంపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉరి శిక్షపై స్టే విధించడంపై ఆమె కన్నీరుపర్యంతమయ్యారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను దోషులు ఉపయోగించుకుంటూ ఉరిని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. పురుషులు కాబట్టే ఉరిని తప్పించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించింది.. తన కుమార్తెను చంపిన వారికి బతికే హక్కు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు..ఒక వైపు రాష్ట్రపతి, మరో వైపు సుప్రీంకోర్టు సైతం ఉరి శిక్షను ధృవీకరించినా, కింద కోర్టులలో ఇలా స్టే రావడం అన్యాయమని అన్నారు.