ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెయిడ్ ఆర్టిస్ట్‌లతో అమరావతిలో ఉద్యమం : పృథ్వీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2020, 12:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు గత 17 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అటు ప్రభుత్వం జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికల అధ్యయనం తర్వాత రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుచేయనున్నట్టు పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో భూములిచ్చిన తమ పరిస్థితేంటని అమరావతి రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో రైతులు చేస్తున్న ఉద్యమంపై వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఒంగోలులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానుల వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు.


ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, పలువురు నిపుణుల కమిటీల నివేదికల ఆధారంగా తీసుకున్న నిర్ణయం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. అమరావతిలో ప్రస్తుతం పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందని పృథ్వీరాజ్‌ విమర్శించారు. వారు సాధారణ రైతులైతే ఆడి కార్లు,మహిళల చేతులకు బంగారు గాజులు వారికి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పేరుకే అది రైతుల ఉద్యమం, కానీ అక్కడ నడుస్తున్నది కార్పొరేట్ మాయాజాలం అని ధ్వజమెత్తారు.


రైతుల ముసుగులో సాగుతున్న కార్పొరేట్ ఉద్యమాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ కల్యాణ్‌కు ఇవేవీ కనిపించడం లేదా అని నిలదీశారు. దేవాలయాలపై డాక్యుమెంటరీలు తీసే క్రమంలో శనివారం ఒంగోలు చెన్నకేశవాలయాన్ని దర్శించుకున్నారు. మన దేవాలయాలు అనేక కార్యక్రమం ద్వారా ప్రాచీన, ప్రాశస్త్యం కలిగిన ఆలయాల విశిష్ఠతను వెలుగులోకి తీసుకురానున్నట్టు ఎస్వీబీసీ ఛైర్మన్ అన్నారు. అలాగే స్వామివారికి సంబంధించిన కొత్త కార్యక్రమాలను ఫిబ్రవరి 1 నుంచి రూపొందించి ప్రసారం చేస్తామని అన్నారు. ఎస్వీబీసీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే చర్యలను చేపడతామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com