ఢిల్లీలో చీకటి రాత్రిలో నిర్భయ ఉదంతం జరిగి ఏడేళ్లు అయింది. బస్సులో సామూహిక మానభంగం, తరువాత హృదయవిదారక స్థితిలో మరణం పొందిన ఈ బాలిక తల్లిదండ్రులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. ‘ఈ దేశ రాజధాని ఢిల్లీ మా నుంచి అన్నింటినీ లాక్కుంది. కన్నబిడ్డను దూరం చేసింది. అయితే ఢిల్లీని మేం ద్వేషించడం లేదు. మా స్వ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి అమానుషాలు జరగని ప్రాంతం ఎక్కడుంది? ఎక్కడికని మేం వెళ్లేది? జరుగుతున్న దారుణాలతో ఈ మొత్తం ప్రపంచాన్ని ఈసడించుకోలేం కదా’ అని నిర్భయ తల్లి భారంగా తెలిపింది. 2012 వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఈ తల్లి కూతురు వైద్య సేవల ఉద్యోగం చేస్తూ రాత్రిపూట తిరిగి నివాసానికి వస్తున్న దశలో అమానుష చర్యకు బలైంది. దీనితో అప్పటివరకూ ఈ బిడ్డకున్న అసలు పేరు మారి నిర్భయ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిర్భయకు న్యాయం జరగని స్థితి కొనసాగుతూనే ఉందని తల్లి వాపోయింది. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ఒక సత్వర కాలపరిమితిలో న్యాయం జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఉంటేనే తిరిగి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఈ తల్లి చెప్పారు. తన కూతురు అమానుషంగా బలి కావడానికి కారకులైన వారికి ఇప్పటికైనా ఉరిశిక్షలు అమలు చేయాలని, దోషుల కుటిలబుద్ధులతో కాలంగడుస్తోంది తప్ప న్యాయం జరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడిప్పుడే సరైన న్యాయం దిశలో తమకు ఆశలు కలుగుతున్నాయని నిర్భయ తల్లి చెప్పింది. దోషులను త్వరలోనేఉరితీస్తారని, అందుకోసం తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారని తెలిసిందని, ఇది తమకు ఊరట కల్గించే విషయం అని తెలిపారు. తమకు ఎంత బాధ కల్గినా, ఎవరూ ఎదుర్కోని స్థాయి మానసిక క్షోభను అనుభస్తున్నామన్నారు.