ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 06:16 PM

ఢిల్లీ కోర్టు తాజాగా ఉన్నావ్ అత్యాచారం కేసులో తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల కిందట బాధితురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సెంగార్‌ను ఢిల్లీ తీస్ హజార్ కోర్టు దోషిగా తేల్చింది. సెంగార్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. డిసెంబరు 19న శిక్ష ఖరారుచేయనుంది. ఈ కేసులో ఆగస్టు 9న ఎమ్మెల్యే సెంగార్‌పై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు చేయడంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. 2017లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై ఎమ్మెల్యే సెంగార్ అత్యాచారానికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు.. ప్రధాన నిందితుడిగా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ పేరును చేర్చారు. తర్వాత జరిగిన పరిణామాలతో కేసును సీబీఐకి అప్పగించారు. లక్నో కోర్టులో విచారణ కొనసాగుతుండగా బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆమె బంధువులు ప్రాణాలు కోల్పోగా, బాధితురాలు ఆమె తరఫున లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ పరిణామాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ జరిపిన ఢిల్లీ జడ్జ్‌ ధర్మేష్‌ శర్మ సోమవారం తీర్పును వెలువరించారు. 45 రోజుల్లోగా కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీం ఆదేశాల ప్రకారం వాదనలు పూర్తిచేశారు. బాధిత యువతి జులై 28న రాయబరేలిలో జైల్లో ఉన్న తన బంధువును కలవడానికి వెళ్లి తిరిగొస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులిద్దరు మృతిచెందగా, బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీనిని తనపై జరిగిన హత్యాయత్నంగా బాధితురాలు ఆరోపించింది. అంతకు ముందే తనకు ప్రాణహాని ఉందని, ఎమ్మెల్యే సోదరులు తనను బెదిరించారని బాధిత యువతి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ సంఘటనలపై తీవ్రంగా మండిపడిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే, అతని సోదరుడు అతుల్‌ సహా మరో 9 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. బాధితురాలు లేఖతో స్పందించిన నాటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌.. ఉన్నావ్‌ అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసులను లక్నో కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించారు. రోజూవారి వాదనలు విని... 45 రోజుల్లో తుదితీర్పు వెలువరించాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com