దేశం మొత్తాన్నీ కదిలించిన దారుణ కేసుల్లో ఉన్నావ్ రేప్ కేసు ఒకటి. ఇండియాలో జరుగుతున్న అత్యాచారాలపై ఓవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో... ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. బీజేపి ఎమ్మెల్యే కుల్దీప్ సెగార్ను దోషిగా తేల్చింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేయించినట్లు ఆరోపణలొచ్చాయి. మరో నిందితుడు శశిసింగ్ ఈ కిడ్నాప్ చేసినట్లు అభియోగాలున్నాయి. 2019 ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదవ్వడంతో బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నేరపూరిత కుట్ర, కిడ్నాప్, పెళ్లికి బలవంత పెట్టడం, రేప్ సెక్షన్లతోపాటూ... పోక్సో కింద కూడా ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు పది రోజుల ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడగా... బాధితురాలి బంధువులు మరణించారు. బాధితురాలి తండ్రిపై యూపీలో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే మరో కేసు నమోదయ్యాయి. ఆయన్ను అరెస్టు చెయ్యగా... జైలులోనే చనిపోయారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో... 2019 ఆగస్టు ఒకటిన ఈ కేసును సుప్రీంకోర్టు... లక్నో బెంచ్ నుంచీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందిన బాధితురాలిని ఈమధ్యే ఇంటికి తరలించి సీఆర్పీఎఫ్సెక్యూరిటీ కల్పించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చెయ్యగా... ఆగస్ట్ 5 నుంచీ ఢిల్లీ కోర్టు రహస్య విచారణ జరిపింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసుపై ఇవాళ ఢిల్లీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తీర్పు ఇచ్చారు.