ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైదానంలోనే తోటి క్రికెటర్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు...

international |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 06:39 PM

మైదానంలో తన తోటి క్రికెటర్‌పై భౌతిక దాడికి పాల్పడిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షహదాత్‌ హుస్సేన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఏడాదిపాటు నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా ఖుల్నాలోని షేక్ అబు నసీర్ స్టేడియంలో ఢాకా డివిజన్‌-ఖుల్నా డివిజన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు ఆటలో భాగంగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే బంతిని ఒకవైపే షైన్‌ చేయొద్దంటూ తోటి ఆటగాడు ఆరాఫత్‌ సన్నీ చెప్పడంతో ఆగ్రహానికి గురైన షహదాత్‌ మైదానంలోనే దాడికి దిగాడు. మైదానంలో అందరూ చూస్తుండగానే ఎందుకు షైన్‌ చేయకూడదంటూ ఆరాఫత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చే సరికి ఆరాఫత్‌ సన్నీని షహదాత్‌ హుస్సేన్‌ పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అతడిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లెవల్‌ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై 12 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ నుంచి షహదాత్‌ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. తనపై విధించిన నిషేధానికి సైతం అతడు అంగీకరించాడని బిసిబి టోర్నమెంట్ కమిటీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా, మ్యాచ్ అనంతరం ఆరాఫత్‌ మాట్లాడుతూ "బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదు. ఇదే విషయాన్ని షహదాత్‌కు చెప్పాను. అతను నాతో గొడవకు దిగాడు. ఆ సమయంలోనే నాపై చేయి చేసుకున్నాడు" అని అన్నాడు. మరోవైపు ఈ వివాదానికి కారణమైన షహదాత్‌ మాట్లాడుతూ "నేను సస్పెండ్‌ అయిన కారణంగా ఎన్‌సీఎల్‌ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేను. నా సహనాన్ని కోల్పోయాను. కానీ అతను కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతన్ని చేయి చేసుకునే వరకూ వెళ్లాల్సి వచ్చింది. నేను బంతిని షైన్‌ చేస్తుంటే వద్దన్నాడు" అని చెప్పుకొచ్చాడు. "ఎందుకు అని అడిగా. కానీ గట్టిగా అరుస్తూ నన్ను ఏదో అన్నాడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్రమంలోనే అతడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది" అని షహదాత్‌ అన్నాడు. కాగా, బంగ్లాదేశ్‌ తరఫున 38 టెస్టులు ఆడిన షహదాత్‌ 72 వికెట్లు పడగొట్టాడు. 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. గతంలో 2015లో కూడా షహదాత్‌పై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com