సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్న ఆయన.. తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇస్తామని ప్రకటించారు. మంగళవారం అమరావతిలో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ ఎంప్లాయిస్ వెబ్ సైట్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ను ప్రారంభిస్తున్నామని.. పొరుగు సేవలన్నింటినీ దాని పరిధిలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు సీఎం.
పొరుగు సేవల ఉద్యోగాల్లో ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీలకు చెందిన వారు 50శాతం మంది ఉండాలని.. అందులోనూ జిల్లా స్థాయిలో 50శాతం ఉద్యోగాలను మహిళలకే ఇస్తామని ప్రకటించారు. ఆయా శాఖల నుంచి డిసెంబరు 15 కల్లా ఉద్యోగుల జాబితా రావాలని.. జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్లేస్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. జీతాలతో పాటు ఇతర విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఉద్యోగులు మోస పోకుండా.. వారికి మేలు జరిగేందుకు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను తీసుకొచ్చినట్లు చెప్పారు జగన్.