తెలుగు సాహితీవనంలో ఎంతోమంది మహామహుల మధ్య తన సాహిత్య విలువలతో సమాజానికి సందేశాన్నందిస్తున్న యామినీదేవి సాహిత్య సేవలు నిరంతరం ఇలాగే కొనసాగాలని, ఈ రంగంలో ఆమె శిఖరంలా నిలవాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. సాహితీ రంగంలో ఉత్తమ సేవలందిస్తున్నందుకుగాను గన్నవరానికి చెందిన రచయిత్రి కోడె యామినీదేవి ఒంగోలుకు చెందిన కళామిత్ర కళా సంస్థ నుంచి ఆదివారం రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, కళామిత్ర చైర్మన్ తేళ్ళ అరుణ, ప్రముఖ సినీనటుడు గిరిబాబు తదితరుల చేతుల మీదుగా యామినీదేవి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో సభకు అధ్యక్షత వహించిన కళామిత్ర అధ్యక్షుడు నూనె అంకమ్మరావుతో పాటు గుత్తికొండ సబ్బారావు, నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ తదితరులు ఈ సందర్భంగా యామినీదేవి సాహితీ సేవలను ప్రశంసించారు. గతంలో యామినీదేవి పలు ప్రముఖ కళాసంస్థల నుంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా యామినీదేవిని పలువురు ప్రముఖులు అభినందించారు.