పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల 18 నుంచి డిసెంబరు 13 వరకు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉభయ సభల సెక్రటేరియట్లకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదింపజేసే అవకాశం ఉంది. అలాగే, దేశీయ తయారీ సంస్థలతో పాటు కొత్త కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ (అత్యవసరాదేశం) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే, ఈ-సిగరెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ధూమపాన పరికరాలపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర సర్కారు ఇటీవల ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర వేసింది. ఇవి చట్టరూపం దాల్చేందుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది.