హర్యానా అసెంబ్లీ ఎన్నికల బిజెపి అభ్యర్థి బక్షిష్ సింగ్ విర్క్ను ఆ పార్టీలోనే అత్యంత నిజాయితీపరుడని రాహుల్ అభివర్ణించారు. ఈవిఎంలో ఏ పార్టీ మీటా నొక్కినా బిజెపికే వెళుతుందని బక్షిష్ వివాదాస్పద వ్యాఖ్య చేయడంతో దీనిపై స్పందిస్తూ రాహుల్ ఈ కామెంట్ చేశారు. కాగా బక్షిష్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీచేసింది. ఇదిలా ఉంటే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బక్షిష్ వాఖ్యలపై వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టినట్లు తెలుస్తోంది. హర్యానాలోని అస్సంద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బక్షిష్ ఇటీవల బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ఎవరికి ఓటు వేసినా మాకు తెలుస్తుంది. మేము కావాలనే మీకు ఆ విషయం చెప్పము. ఓటర్లను ఉద్దేశిస్తూ మీ ఇష్టమైన వారికి ఓటు వేసుకోండి..కాని మీ ఓటు మాత్రం బిజెపికే వెళుతుంది.
అని ఈవిఎం యంత్రాలలో మేము ఒక పరికరాన్ని అమర్చాము. అని కూడా ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ ఆదివారం బక్షిష్కు నోటీసు జారీ చేసింది. అయితే కొందరు వ్యాఖ్యలను వక్రీకరించారని బక్షిష్ వివరణ ఇచ్చారు. తాను ఎన్నికల కమిషన్ను గౌరవిస్తానని, ఈవిఎంలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆయన తెలిపారు.